అక్టోబర్ 31 దాకా ఓటర్ల నమోదు
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ విడుదల చేశారు. వచ్చే అక్టోబర్ 31 నాటికి పోలింగ్స్టేషన్లను హేతుబద్ధం చేయడంతోపాటు, జాబితాలో పేరు ఉండి, సదరు చిరునామాలో లేనివారి పేర్లను, అలాగే ఇటీవలి కాలంలో మరణించినవారి పేర్లను తొలిగించనున్నారు. వచ్చే జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏండ్లు నిండనున్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని సీఈవో చెప్పారు. వారు తమ పేర్లను ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 మధ్య రెండు శనివారాలు, రెండు ఆదివారాల్లో అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్ను నిర్వహించనున్నట్లు సీఈవో తెలిపారు. 2021 జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తామని శశాంక్ గోయల్ వివరించారు. బీఎల్ఓల ద్వారా, ఆన్లైన్లో http:// www.nvsp.in వెబ్సైట్లో కూడా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/