గద్దర్‌ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

vips-pay-tributes-to-gaddar-in-lb-stadium

హైదరాబాద్‌: పలువురు ప్రముఖులు ప్రజా గాయకుడు గద్దర్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్‌.. ఆదివారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ఈనేపథ్యంలో జనం గొంతుకగా నిలిచిన గద్దర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత జానారెడ్డి, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని, సీఎం నేత జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, నివాళులర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా సీనియర్‌ నటుడు మోహన్‌బాబు, అలీ, నాగబాబు, ఆయన కుతూరు నిహారిక.. గద్దర్‌ పార్ధివదేహానికి నివాళులర్పించారు.

మరికాసేపట్లో గద్దర్‌ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. గన్‌పార్క్‌, అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్‌ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు సాగనుంది. అల్వాల్‌ గద్దర్ పార్థవదేహాన్ని కొంత సమయం ఉంచనున్నారు. అనంతరం సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.