జూలో చిరుత పిల్లకు పాలు తాగించిన సీఎం యోగి

యూపీ సీఎం యోగి గోరఖ్‌పూర్ జూను సందర్శించి.. అక్కడో చిరుత పిల్లకు పాలు తాగించారు. దీనికి సంబంధించిన వీడియోను యూపీ సర్కార్ తమ అధికారిక యూట్యూబ్ పేజీలో షేర్ చేసింది. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు. ఆయన చుట్టూ పశువైద్యులు ఉండగా పాల సీసాతో పులి పిల్లకు పాలుపట్టారు. చిరుత పిల్ల తొలుత పాలు తాగేందుకు సంశయించింది. చేతులకు రక్షణ కోసం రబ్బరు గ్లోవ్స్ ధరించిన యోగి ఆ తర్వాత దానిని తన ఒళ్లోకి తీసుకుని మళ్లీ పాలు తాగించేందుకు ప్రయత్నించారు. ఈసారి అది పాలను గటగటా తాగేసింది.

అనంతరం సీఎం జూ అంత కలియదిరిగారు. పులులను ఉంచిన ఎన్‌క్లోజర్ల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా జూ అధికారులు ఆయనతో మాట్లాడుతూ.. ఎన్‌క్లోజర్లకు సంబంధించిన విషయాలు, పులుల నిర్వహణ వంటి వాటిపై వివరించారు. షహీద్ అష్ఫక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌గా పిలిచే గోరఖ్‌పూర్ జూను గతేడాది మార్చిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. పూర్వాంచల్ ప్రాంతంలో ఇదే తొలి జూ పార్క్ కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడోది.