సిఎం అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయాలిః అనురాగ్ ఠాకూర్

రాజస్థాన్ లో మహిళలపై నేరాలు పెరుగుతున్నప్పటికీ చర్యలు లేవని ఆగ్రహం

Union Minister Anurag Singh Thakur alleges Crime against women has increased in Rajasthan

న్యూఢిల్లీః రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని బిజెపి నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో మహిళలపై మొత్తం 1.09 లక్షల నేరాలు నమోదయ్యాయన్నారు. దేశంలో నమోదైన రేప్ కేసులలో 22 శాతం రాజస్థాన్ నుండే ఉన్నాయన్నారు.

వీటికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బాధ్యత వహించి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేబినెట్ లోని మంత్రి విమర్శలు చేశారని, కానీ సొంత పార్టీ నేత విమర్శలు చేశారని, బర్తరఫ్ చేశారన్నారు. సొంత మంత్రి రాజేంద్ర సింగ్ గుడా చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు. నేరస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు మంత్రిని తొలగించారని విమర్శించారు.

మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు రాజస్థాన్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నారు. మహిళలపై నేరాల్లో రాజస్థాన్‌ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని దుయ్యబట్టారు. దేశంలో పలు రాష్ట్రాల్లో మహిళలపై ఘోరాలు జరిగాయన్నారు. బెగుసరాయ్ లో జరిగిన ఘటన మనముందు ఉందని, దీనిపై నితీష్ కుమార్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు.