అండర్ వరల్డ్ డాన్ “దావుద్ ఇబ్రహీం” పై విష ప్రయోగం.?
న్యూఢిల్లీః పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు సమాచారం. ఆయన తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్ కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. భారీ భద్రత నడుమ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారట.
ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసులు దావూద్ బంధువుల దగ్గరి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దావూద్ మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో చికిత్స పొందుతున్నాడు.ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే ఉన్నట్లు తెలిసింది. అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ పఠాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్ గత కొంతకాలంగా కరాచీలోనే నివసిస్తున్నాడు. 1993 ముంబయి పేలుళ్ల తర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా దావూద్ ఇబ్రహీంపై ముద్ర పడింది. 2003లో అమెరికా కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. గతేడాది తమ భూభాగంలోని 88 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించిన సందర్భంగా తొలిసారి దావూద్ తమ దగ్గరే ఉన్నాడని పాక్ అంగీకరించింది. అతన్ని తమకు అప్పగించాలని ఎన్నోసార్లు ఇండియా డిమాండ్ చేసినా పాక్ వినిపించుకోలేదు. ఇక అతడి కోసం ఇండియానే కాకుండా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు వెదుకుతున్నాయి.