ఇంతటి గొప్ప ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు : బోరిస్ జాన్సన్
భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సత్సంబంధాలపై బోరిస్ హర్షం

న్యూఢిల్లీ: రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ నుంచి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోడీని కలిశారు. ఆయనకు అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ… భారత ప్రభుత్వం నుంచి తనకు లభించిన ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేశారు. మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్, బ్రిటన్ మధ్య ఇప్పుడున్నంత బలంగా సత్సంబంధాలు ఇంతకు ముందు ఎన్నడూ లేవని, ఇటువంటి సమయంలో తాను భారత్లో పర్యటిస్తుండడం శుభ సందర్భమని బోరిస్ జాన్సన్ చెప్పారు. తాను ఇంతటి గొప్ప ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రపంచంలో తాను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమోనని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఉదయం కూడా బోరిస్ జాన్సన్ ట్వీట్ చేస్తూ.. తన స్నేహితుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. నిరంకుశ రాజ్యాల నుంచి బెదిరింపులు పెరుగుతోన్న సమయంలో వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని బోరిస్ జాన్సన్ చెప్పారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/