దసరా పండుగ సందర్భాంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

మరో వారం రోజుల్లో దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం.. తెలంగాణ ఆర్టీసీ.. కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా టీఎస్ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు కట్టిపడేస్తుంది సంగతి తెలిసిందే. ఏ పండగొచ్చిన కానీ ఏ వేడుకైన సరే ప్రయాణికుల కోసం ప్రవైట్ ట్రావెల్స్ కు దీటుగా ఆఫర్లను తీసుకొస్తుంది. ఇక ఇప్పుడు దసరా సందర్బంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మరో నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 26 వ తేదీ నుంచి శరన్నవ రాత్రులు ప్రారంభం కానుండగా.. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. సుమారు 4 వేల బస్సుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది ఈ సమయంలో 3300 బస్సుల వరకు నడిపింది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను అనుమతి కోసం ఆర్టీసీ అధికారులు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే.. బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా సిద్ధం అవుతోంది.