రెండ్రోజుల్లో ఇద్దరు భారత పైలెట్లు మృతి

two-indian-pilots-dies-in-two-days

న్యూఢిల్లీః నిన్న ఒకరు, ఈరోజు మరొకరు… వరుసగా రెండ్రోజుల్లో ఇద్దరు భారత పైలెట్లు మృతి చెందడం విమానయాన వర్గాల్లో విషాదం నింపింది. నిన్న ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన ఢిల్లీ-దోహా విమానంలో పైలెట్ మరణించారు. ఆయన ఈ విమానంలో అదనపు సిబ్బందిలో ఒకరిగా ఉన్నారు. విమానంలో ప్రయాణికుల క్యాబిన్ లో కూర్చుని ఉండగా, గుండెపోటుకు గురయ్యారు. ఆయనను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

నేడు, నాగపూర్-పూణే ఇండిగో విమానంలో విధులు నిర్వర్తించాల్సిన ఓ పైలెట్… నాగపూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేటు వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆ పైలెట్ మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇండిగో విమానానికి ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు పైలెట్ల మరణాలను డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్ధారించింది .