తెలంగాణలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ.. తుమ్మల తొలి నామినేషన్

tummala-nageswara-rao-has-filed-his-nomination

హైదరాబాద్‌ః తెలంగాణలో తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈరోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పదో తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా నిర్మల్ లో బిజెపి అభ్యర్ధి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా నామినేషన్ వేశారు.

కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసులను అధికారులు జారీ చేస్తారు. ఆ తర్వాతి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 10తో ముగుస్తుంది. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది.

అభ్యర్థులు ఈసారి తమ నేరాలను దాచే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. వాటిని స్పష్టంగా పేర్కొనాలంటూ ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు, వాటిని మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని కూడా ఆదేశించింది. అభ్యర్థి జైలులో కనుక ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా మొత్తం 3.17 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబరు 3న ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తం 119 స్థానాలకు గాను అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 100, బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.