టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు ఇవే..

పోటు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు

ttd-these-are-the-key-decisions-of-the-ttd-governing-council

తిరుమలః తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇవాళ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో… శ్రీవారి ప్రసాదం పోటు కార్మికుల వేతనాల పెంపు, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ నిర్ణయాలు ఇవిగో….

శ్రీవారి ప్రసాదం పోటు కార్మికుల వేతనం రూ.10 వేల మేర పెంపు. ఇప్పటివరకు పోటు కార్మికుల వేతనం రూ.28 వేలు… ఇకపై అది రూ.38 వేలు కానుంది.
3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న ఇళ్ల స్థలాల పట్టాలు అందజేత. జనవరిలో మరో 1,500 మందికి ఇంటి పట్టాలు
రిటైర్డ్ ఉద్యోగులకోసం ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేయాలని నిర్ణయం. రూ.85 కోట్లతో 350 ఎకరాలు కొనుగోలు చేయనున్న టీటీడీ
పారిశుద్ధ్య విభాగంలో వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపునకు నిర్ణయం
ఉగ్రాణం కార్మికులు, వాహన బేరర్లను నైపుణ్య పనివారుగా గుర్తించి ఆ మేరకు వేతనాల పెంపు
ప్రతి ఏటా పెద్ద జీయర్ మఠానికి ఇచ్చే ప్యాకేజీ రూ.2 కోట్ల నుంచి రూ.2.60 కోట్లకు పెంపు
ప్రతి ఏటా చిన్న జీయర్ మఠానికి ఇచ్చే ప్యాకేజీ రూ.1.70 కోట్ల నుంచి రూ.2.10 కోట్లకు పెంపు
తిరుమల కల్యాణకట్టలో పీస్ రేట్ ప్రాతిపదికన పనిచేస్తున్న క్షురకుల కనీసం వేతనం రూ.20 వేలకు పెంపు
శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయం
తిరుపతిలో పాత సత్రాల స్థానంలో కొత్త వసతి గృహ సముదాయాల నిర్మాణం టెండర్లకు ఆమోదం
ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం
రూ.14.5 కోట్లతో గోగర్భం డ్యామ్ వద్ద క్యూలైన్ నిర్మాణానికి టెండర్ ఆమోదం