కూల్‌రూఫ్‌ భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతుందిః మంత్రి కెటిఆర్‌

కూల్‌రూఫ్‌ మీటర్ కు రూ.300 మాత్రమే ఖర్చవుతుందన్న మంత్రి

ts-minister-ktr-launches-telangana-cool-roof-policy

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023-28ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్‌ర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్‌ రూఫ్‌ విధానం అమలుచేశామన్నారు.దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. టీఎస్‌ బీపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ అమలుచేస్తామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లన్నిటిపై కూల్‌ రూఫ్‌ అమలు చేస్తామన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్‌ రూఫ్‌ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్‌ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి కూల్ రూఫ్ కు ఉపయోగిస్తామని మంత్రి కెటిఆర్‌ చెప్పారు.