ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్
అవినాశ్ పిటిషన్ను కొట్టేసిన కోర్టు

అమరావతిః వైఎస్ఆర్సిపి నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది.
సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని, విచారణపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే.. విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించింది. కానీ..విచారణ సమయంలో న్యాయవాది అస్సలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఆడియో, వీడియో రికార్డు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.