ఒకే వేదిక పై ప్రధాని మోడీ ..మెగా హీరో రామ్ చరణ్

Prime Minister Modi and mega hero Ram Charan on the same stage

న్యూఢిల్లీః అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా మార్చి 13న జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేదికపై ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అందుకుని తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. నాటు నాటు పాటకుగానూ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఆస్కార్ వేడుకలలో డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్‏తోపాటు చిత్రయూనిట్ కూడా పాల్గొంది. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం అనంతరం ఇప్పటికే తారక్ హైదరాబాద్ చేరుకోగా.. ఈరోజు ఉదయం జక్కన్న అండ్ టీం సైతం హైదరాబాద్ వచ్చేశారు. ఇక కాసేపటి క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ట్రిపుల్ ఆర్ టీం మొత్తం నేరుగా హైదరాబాద్ రాగా.. చరణ్ మాత్రం ఢిల్లీకి వెళ్లడం పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇందుకు బలమైన కారణమే ఉంది.

ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న చరణ్ కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలో ఇండియా టూడే ఛానల్ నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధానీ మోడీతో కలిసి చరణ్ ఈ వేదికను పంచుకోనున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న చరణ్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని.. ఆర్ఆర్ఆర్ ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్ లను చూసి తాము గర్విస్తున్నామని.. వారి వల్లే రెడ్ కార్పెట్ పై వెళ్లి భారత్ కు ఆస్కార్ తీసుకురాగలిగాము అన్నారు. నాటు నాటు సాంగ్ ఇండియన్స్ సాంగ్ అని.. ఆస్కార్ అవార్డ్ అందుకునేందుకు అది ఒక మార్గాన్ని ఇచ్చిందన్నారు.

ఇదిలా ఉంటే… ఢిల్లీలో జరగబోయే సదస్సులో మోడీ ప్రసంగం అనంతరం చరణ్ మాట్లాడనున్నారని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు.. ఆ కార్యక్రమంలో సచిన్, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఎస్ జై శంకర్, కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, పి చిదంబరం ఇతర ప్రముఖులు హజరుకానున్నారు. ఆస్కార్ గెలిచిన తర్వాత రామ్​ చరణ్ ఢిల్లీలో తొలిసారి పర్యటిస్తున్నందున అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఫ్యాన్స్​ భారీ ఎత్తున నినాదాలు చేశారు.