షేక్ హ్యాండ్ నుంచి ‘నమస్తే’ దిశగా దేశాధినేతలు
నమస్తే చెప్పుకున్న ట్రంప్, ఐర్లండ్ ప్రధాని
వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రభావం వల్ల సంప్రదాయాలు మారిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఐర్లండ్ ప్రధాని లియో వరాద్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ నమస్తే చెప్పుకున్నారు. ఐర్లండ్ ప్రధాని లియోకు భారతీయ మూలాలున్న విషయం గమనార్హం. లియోను ఏ విధంగా గ్రీట్ చేశారంటూ ట్రంప్ ను మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘మేమిద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఒకరినొకరు చూసుకున్నాం. కాసేపు ఇబ్బందిగానే అనిపించింది. నమస్తే చెప్పుకున్నాం. కొన్ని రోజుల క్రితమే నేను ఇండియా నుంచి వచ్చా. అక్కడ ఎవరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. నమస్తే పెట్టడం చాలా సులభం’ అని చెప్పారు. ఇదే విషయం గురించి లియోను మీడియా ప్రశ్నించగా… ఆయన రెండు చేతులు జోడించి నమస్తే పెట్టారు. వెంటనే పక్కనే ఉన్న ట్రంప్ కూడా చేతులు జోడించారు. ఆ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, వాస్తవానికి తాను ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇవ్వనని… కానీ రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఇది తప్పదని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/