దేశాన్ని మాంధ్యంలోకి నెట్టేశారు

ట్రంప్‌ పై విరుచుకుప‌డ్డ‌ జో బైడెన్

Joe Biden
Joe Biden

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్య‌క్ర‌మంలో భాగంగా ఎన్నిక‌ల డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి  జో బైడెన్ మాట్లాడుతూ..క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌ను ఎదుర్కోవ‌డంలో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని, త‌మ దేశాన్ని మాంధ్యంలోకి నెట్టేశార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ట్రంప్ త‌ల‌కిందులు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. మార్చి, ఏప్రిల్ లో ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు లేఆఫ్ ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, వారిలో దాదాపు స‌గం మంది పూర్తిగా ఉద్యోగాల‌ను కోల్పోయార‌ని జో బైడెన్ విమర్శించారు.

ఈ ప‌రిస్థితుల‌న్నీ ట్రంప్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే వాటిల్లాయ‌ని, ఆయ‌న అమెరికా అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగడానికి అనర్హుడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘రాత్రి భోజ‌నం చేసే స‌మ‌యంలో త‌మ కుటుంబంలోని కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌తో లేర‌నే బాధ‌ను చాలా మంది అమెరిక‌న్లు అనుభ‌విస్తున్నారు. ఇది ట్రంప్ వైఫ‌ల్యాల ఫ‌లిత‌మే’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. క‌రోనా వ‌ల్ల అమెరికాలో 1,90,000 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆయ‌న చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/