స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

మంగళవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు రోడ్డు క్లోజ్

Traffic restrictions in Hyderabad

హైదరాబాద్‌ః స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని గోల్కొండ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ఆంక్షల్లో భాగంగా రాణి మహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డును మూసివేయనున్నారు. అదేవిధంగా పలు రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

గోల్కొండలో జరిగే వేడుకలకు హాజరయ్యే వారికోసం అధికారులు పలు సూచనలు చేశారు. ప్రయాణించాల్సిన మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాపు విడుదల చేశారు. ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బి నీలం, సీ గ్రీన్, డీ ఎరుపు, ఈ నలుపు పాసులు అందజేయనున్నారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ టాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, బి నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతించనున్నారు. పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిని ఏ గోల్డ్ పాసులున్న వారి వాహనాల పార్కింగ్ కు కేటాయించారు.

ఏ పింక్ పాసులున్న వారి వాహనాల పార్కింగ్ కోసం గోల్కొండ బస్టాప్ వద్ద ఏర్పాట్లు చేసినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఆ పక్కనే ఉన్న ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద బీ నీలం పాసులు ఉన్న వారు వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. ఇక సీ గ్రీన్ పాసులు ఉన్న వాహనదారులు తమ వాహనాలను జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలన్నారు. ప్రియదర్శిని స్కూలులో డీ ఎరుపు పాసులున్న వారి వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నలుపు పాసులన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలని, సామాన్యులు తమ వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్క్ చేయాలని అధికారులు సూచించారు.