ఉజ్జయినీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఆదివారం , సోమవారం ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 17వ తేదీ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మరుసటి రోజు పూజలు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయన్నారు.
సాధారణ ప్రజలు కర్బాల మైదానం, రాణిగంజ్, ఓల్డ్ రాంగోపాల్పేట్ పీఎస్, ప్యారడైజ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్, బాటా, ఝూన్సీమండీ ఎక్స్ రోడ్, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్పురా రూట్లలో ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి మరుసటి రోజు జాతర పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. కాగా, పూజల సందర్భంగా మహంకాళి ఆలయం నుంచి టోబాకో బజార్, హిల్ స్ట్రీట్, సుభాష్ రోడ్, బాటా చౌరస్తా నుంచి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వరకు , అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం వరకు, జనరల్ బజార్ నుంచి ఆలయ మార్గం రోడ్డు , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెయింట్ మేరీస్ రోడ్డు, క్లాక్టవర్ వరకు రోడ్లను మూసివేయనున్నారు.
ఇక జాతరకు రెండు రోజుల ముందే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, పాతబస్తీలోని లాల్దర్వాజ మహంకాళి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి
ఒడి బియ్యం, బోనాలు సమర్పిస్తున్నారు.