నేడే ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఆవిష్కరణ ..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. రాజస్థాన్​లోని రాజ్ సమంద్ జిల్లా నాథ్ద్వారా టౌన్​లో నిర్మించిన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని ఈరోజు శనివారం ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సమక్షంలో దీనిని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా నేటి నుంచి నవంబరు 6 వరకు తొమ్మిది రోజుల పాటు పలు మతపరమైన, ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ శివుడి విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

ఉదయపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహాన్ని తత్ పదం సంస్థాన్ నిర్మించింది. ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంది. 20 కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది. కొండపై ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోయి రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ‘విశ్వాస స్వరూపం’ ప్రపంచంలోనే ఎత్తైన శివ విగ్రహం వద్ద లోపలికి వెళ్ళడానికి నాలుగు లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విగ్రహం పూర్తి చేయడానికి పది సంవత్సరాలు పట్టింది. 2012 ఆగస్టులో అప్పటికి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్, మొరారీ బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. విగ్రహ నిర్మాణంలో మూడు వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను ఉపయోగించారు. వర్షం, ఎండ నుండి రక్షించడానికి రాగి రంగు విగ్రహానికి జింక్ మిశ్రమంతో పూత పూయబడింది. ఈ విగ్రహం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదు. ఈ విగ్రహం రూపకల్పన యొక్క విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో జరిగింది. విగ్రహం చుట్టూ ఉన్న వేదిక బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి కార్యకలాపాలకు ఆతిథ్యం ఇస్తుంది. పర్యాటకులు ఈ ప్రాంతంలో ఆహ్లాదం పొందేందుకు ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ను అందుబాటులో ఉంచారు.