నారా భువనేశ్వరి ని కలిసాడని చెప్పి కానిస్టేబుల్‌‌ను సస్పెండ్ చేసిన తిరుపతి ఎస్పీ

ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లఘించి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసాడని చెప్పి సాకిరి రాజశేఖర్‌ అనే కానిస్టేబుల్‌‌ను సస్పెండ్‌ చేసారు తిరుపతి ఎస్పీ. ఇటీవల అన్నమయ్య జిల్లాలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి జిల్లా భాకరాపేట మీదుగా నారా భువనేశ్వరి వెళ్తుండగా సాకిరి రాజశేఖర్ కలిశారని తేలింది. తిరుపతి దిశ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న అతడు నిబంధనలను అతిక్రమించారని నిర్ధారణ కావడం తో ఆయనపై వేటు వేశారు.

ఈ మేరకు బుధవారం SP ఆదేశాలు జారీ చేశారు. పలు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతపరచడం, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.