ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాదు తేల్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హాయ నిరాక‌ర‌ణే కారణ‌మ‌ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పార్ల‌మెంటు వేదిక‌గా తెలిపారు. ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టులకు ఏపీ నిధులను కేటాయించడం లేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రూ.1,798 కోట్లు పెండింగ్ నిధులు ఏపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు.

ఈ పరిస్థితుల్లో ఏపీలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేమని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ… రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి స‌హ‌క‌రించేలా చేస్తే… ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వ‌రిత‌గ‌తిన పూర్తి అవుతాయ‌ని మంత్రి వివ‌రించారు. ఏపీలో ప్ర‌స్తుతం రూ.70 వేల కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన రైల్వే ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని వైష్ణ‌వ్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల‌ను కాస్ట్ షేరింగ్ ప‌ద్ద‌తిన చేప‌డుతున్న‌ట్లు మంత్రి వెల్లడించారు.