కర్ణాటక కాంగ్రెస్ లో 10 మంది ఎమ్మెల్యేల లేఖ కలకలం

జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడం లేదని ఆరోపణ

dk-shivakumar

బెంగళూరుః కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాసిన లెటర్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఉన్న ఆ లెటర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జిల్లాల ఇన్చార్జీ మంత్రులు ఎమ్మెల్యేల వినతులకు స్పందించడం లేదని… నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదని లేఖలో ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫండ్స్ రిలీజ్ చేయిస్తామంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగారని, కమీషన్ ఇస్తే నిధులను విడుదల చేయిస్తామంటున్నారని చెప్పారు.

ఈ లేఖపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. ఈ 10 మందిలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఈ లేఖ తమ వ్యక్తిగతమైనదని, గురువారం నాడు సీఎల్పీలో దీనిపై చర్చిస్తామని చెప్పారు. అయితే, ఈ లేఖ మీడియాకు లీక్ కావడం కలకలం రేపింది.

మరోవైపు ఈ లేఖపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ… ఇది ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. ఇంకోవైపు లెటర్ లో పేరు ఉన్న మరో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ స్పందిస్తూ… ఈ లేఖ నిజం కాదని అన్నారు. ఇది బీజేపీ కొత్త నాటకంలో భాగమని ఆరోపించారు. ఇది తన లెటర్ హెడ్ అని… అయితే లెటర్ హెడ్ పై తాను సీరియల్ నెంబర్లు వేస్తుంటానని, అందువల్ల అవి మిస్ యూజ్ కాకుండా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు తన పేరుతో బయటకు వచ్చిన లెటర్ హెడ్ పై సీరియల్ నెంబర్ లేదని తెలిపారు.