త్వరలోనే భారత్ లోకి టెస్లా కంపెనీ ఎంట్రీ: ఎలాన్ మస్క్

ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఎలాన్ మస్క్ ప్రకటన

‘Tesla to be in India as soon as…,’ says Elon Musk

వాషింగ్టన్‌ః ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో సంచలనాలు స‌ృష్టించిన టెస్లా కంపెనీ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఈమేరకు ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటన చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టెస్లా కంపెనీ త్వరలోనే ఇండియాలో కార్యకలాపాలు మొదలుపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ గతంలో తమ టెస్లా కంపెనీని సందర్శించారని మస్క్ గుర్తుచేశారు. మోదీని మరోమారు కలుసుకోవడం సంతోషంగా ఉందని, తమ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భేటీ అద్భుతంగా జరిగిందంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎనర్జీ రంగం నుంచి ఆధ్యాత్మికం దాకా ఎన్నో విషయాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయని మోదీ వివరించారు. ట్విట్టర్ యజమాని కూడా అయిన ఎలాన్ మస్క్ భారత ప్రధాని మోడీ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. మిమ్మల్ని మరోమారు కలుసుకోవడం నాకు గర్వకారణమని పేర్కొన్నాడు.