ఏకె-47తో మహిళా కార్పొరేటర్‌ భర్త

Corporator’s husband holding AK-47
Corporator’s husband holding AK-47

హైదరాబాద్‌: నగరంలోని ఓ మహిళా కార్పొరేటర్‌ భర్త ఏకె-47 తుపాకీ ఎక్కుపెట్టి ఉన్న ఫోటో స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ తుపాకీని ఆయనకు ఎవరిచ్చారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. వివరాల్లోకెళితే.. రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ కోరని శ్రీలత భర్త మహాత్మ చేతిలో ఏకె-47 గురిపెట్టి ఓ ఫోటో దిగారు. దీనిపై పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం పోలీసు అధికారుల శిక్షణ శిబిరానికి వెళ్లానని… రాజేంద్రనగర్ సర్కిల్ లోని మానస హిల్స్ వద్ద బందోబస్తులో ఉన్న ఓ పోలీసు వద్ద నుంచి తుపాకీ తీసుకుని ఫొటో దిగానని ఆయన చెప్పారు. దాన్ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి, ఆ తర్వాత డిలీట్ చేశానని తెలిపారు. ఎవరో కావాలనే ఈ ఫొటోను వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/