ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

నేను ప్ర‌జ‌ల మ‌ద్దుతోనే గెలుస్తూ వ‌స్తున్నాను

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు.

అమరవీరులకు నివాళులు అర్పించిన అనంత‌రం ఈట‌ల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ట్టడికి తెలంగాణ స‌ర్కారు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేదని చెప్పారు. తాను ప్ర‌జ‌ల మ‌ద్దుతోనే ఇన్నాళ్లూ ఎన్నిక‌ల్లో గెలుస్తూ వ‌స్తున్నానని అన్నారు.


కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/