తెలంగాణ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ

Telangana High Court

హైదరాబాద్‌ః తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చిల్లకూరు సుమలతను కర్ణాటక, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కు మార్ ను మద్రాస్ హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 10న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘X’ ద్వారా వెల్లడించారు.

రాజ్యాంగం కల్పించిన అధికారాలను అనుసరించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి ఈ న్యాయమూర్తులను బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరితో పాటు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ను మద్రాస్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బి.షరాఫ్ ను అలహాబాద్, జస్టిస్ బిబేక్ చౌదరిని పాట్నా హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.