27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు: హైకోర్టు

ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు

telangana-high-court-gives-green-signal-to-singareni-elections

హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన మధ్యంతర పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో, డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాయి.

అయితే, ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డ హైకోర్టు… ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.