బిఆర్‌ఎస్‌ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపులను రద్దు చేసిన హైకోర్టు

సాయి సింధు ఫౌండేషన్ కు 15 ఎకరాలు కేటాయించిన తెలంగాణ సర్కారు

TS High Court
TS High Court

హైదరాబాద్‌ః అధికార పార్టీ బిఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథి రెడ్డికి సంబంధించిన ఫౌండేషన్ కు భూకేటాయింపులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఎంపీ ఆధ్వర్యంలోని ఫౌండేషన్ కు తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఖానామెట్ లో ఈ భూమిని టిఆర్ఎస్ సర్కారు కేటాయించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ విజయ్ సేన్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వాదోపవాదాలు విన్న తర్వాత నేడు తీర్పు వెలువరించింది. భూ కేటాయింపుల్లో ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా పున:పరిశీలన చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది. సాయి సింధు ఫౌండేషన్ కు భూమిని కేటాయిస్తూ 2018లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టేసింది.