అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ః రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని వెల్లడైంది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని నివేదిక పేర్కొంది. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని.. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని వెల్లడించింది. డీపీఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని వివరించింది.