బీఎస్‌డీ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎల్‌కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్‌లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ విద్యాశాఖ అధికారిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని అన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీ పత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా పేర్కొన్నారు.