అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు – తెలంగాణ సర్కార్
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/06/tg-ramoji.jpg)
రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మరణం పట్ల సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ , తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు , పలు పార్టీల అధినేతలు , రాజకీయ , సినీ ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
ఇక రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. రామోజీ రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తుచేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.