సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందిః గవర్నర్

రాష్ట్ర వృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని వ్యాఖ్య

telangana-developing-in-all-segments-under-cm-kcr-rule-says-governor-tamilisai

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిపై మాట్లాడారు. తెలంగాణ.. దేశానికి ఆదర్శంగా మారిందని అన్నారు. కాళోజీ వాక్కులతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని కాళోజీ అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది’’ అని తమిళిసై వ్యాఖ్యానించారు.

తన ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని ఆమె అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ అవతరిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంలా మారిందని అన్నారు. సంక్షోభం, అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు.

తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు.

2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు.