ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

telangana-assembly-sessions-will-start-from-august-3

హైదరాబాద్‌ : ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా..భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.

రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.