రేవంత్‌ రెడ్డి ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారు – రాజగోపాల్

మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం తో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…రాజగోపాల్ రాజీనామా ప్రకటన అనంతరం మీడియా సమావేశం ఏర్పటు చేసి పలు వ్యాఖ్యలు చేసారు. దీనిపై రాజగోపాల్ సీరియస్ అయ్యారు. రేవంత్‌ రెడ్డి ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారని మండిపడ్డారు.

పీసీసీ పదవిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలను రేవంత్‌రెడ్డి బెదిరించి కోట్ల రూపాయలు కాజేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే రేవంత్ లక్ష్యమని.. అందుకోసం ఎంత నీచానికైనా పాల్పడేందుకు వెనుకాడటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా రేవంత్.. ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సీఎం అయితే సీమాంధ్ర కాంట్రాక్టర్లు, వ్యాపారులు తెలంగాణలో మళ్లీ పాగా వేయొచ్చని ఆశలు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకవేళ రేవంత్ సీఎం అయితే తెలంగాణలో పెత్తనమంతా మళలీ సీమాంధ్రుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్తే.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లారని ఎద్దేవా చేశారు.

నోరు తెరిస్తే సోనియా తల్లి అని మాట్లాడుతున్న రేవంత్.. ఆనాడు సోనియాను బలిదేవత అని నిందించలేదా అని ప్రశ్నించారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. ఇవాళ తాను సోనియాగాంధీని అవమానించారని అనడం సరికాదన్నారు. అక్రమంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ పార్టీని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ లో ఓడిస్తే.. చావు తప్పి కళ్లు లొట్టలు పోయిన చందంగా మల్కాజిగిరిలో గెలిచారని, అలాంటి వ్యక్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరునేదిలేదని హెచ్చరించారు.