మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న

teenmar-mallanna-joined-congress

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. తాజాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అబ్జర్వర్ బోస్ రాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీప్ సిప్పల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్ లో చేరడం అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు హుజూర్ నగర్ ఉపఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకు పెద్ద సంఖ్యలోనే ఓట్లు పడ్డాయి.