ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్..వెల్ లోకి దూసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు మొదలయ్యాయో లేదో..సభలో గందరగోళం స్టార్ట్ అయ్యింది. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్ అయిందనే తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్… ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడదామని చెప్పారు. దీంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు.

టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ సభ్యులు సభకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. టీడీపీ సభ్యులు కావాలనే సభలో రచ్చ చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి రెడ్ లైన్ ను దాటారని అన్నారు. ప్లకార్డులు పట్టుకుని సభలోకి రావడం సరికాదని చెప్పారు.

మరో మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం పని చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. టీడీపీ సభ్యులకు సమస్యలపై చర్చించే దమ్ము లేదని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి జరగబోయేది శవయాత్రేనని చెప్పారు.