తీహార్‌ జైల్లో పెట్టినా గెలుస్తాః భూమా అఖిలప్రియ

ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ

tdp-leader-bhuma-akhila-priya-key-comments-on-upcoming-assembly-elections-in-ap

అమరావతిః ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆళ్లగడ్డ ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. తీహార్ జైలులో పెట్టినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారంటూ ఫిర్యాదు చేస్తే తననే అరెస్టు చేసి జైలులో పెట్టారని విమర్శించారు.

అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. ఏవీ సుబ్బారెడ్డి నిజంగానే పార్టీలో ఉంటే ఈ నాలుగేళ్లు ఏంచేశారో చెప్పాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. పార్టీలోని గుంటనక్కల సంగతి నారా లోకేశ్ చూసుకుంటారని చెప్పారు. కాగా, టీడీపీలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పొడసూపిన విభేదాలు ఇటీవల మరింత ముదిరాయి. కొత్తపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఎదురుగానే ఇరువర్గాలు గొడవపడ్డాయి. అఖిలప్రియ మద్దతుదారుడు దాడి చేయడంతో సుబ్బారెడ్డి ముక్కు నుంచి రక్తం కారింది. దీనిపై ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేశారు.