హైదరాబాద్ ప్రవైట్ హాస్పటల్ లో ‘ఠాగూర్’ సీన్.. శవానికి వైద్యం

హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో ఠాగూర్ సీన్ రిపీట్ చేసారు. సినిమాలో హాస్పిటల్ దోపిడీని బయటపెట్టేందుకు చిరంజీవి మాస్టర్ ప్లాన్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడంటూ ట్రీట్‌మెంట్ చేసి బతికించాలని ఓ శవాన్ని డాక్టర్ల వద్దకు చిరంజీవి తీసుకెళ్తాడు. చిరు ఆవేదనను క్యాష్ చేసుకోవాలని అనుకున్న డాక్టర్లు శవానికి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి డబ్బు గుంజాలని ప్రయత్నిస్తారు. కానీ చివరకి అతడి డెత్ సర్టిఫికెట్ చూపించడంతో అందరూ షాక్ అవుతారు. అచ్చం ఇలాంటి సీన్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిపీట్ అయింది. మరణించిన మహిళకు వైద్యం చేస్తూ లక్షలు దండుకోవాలని చూసారు.

వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స ద్వారా ఆదివారం సాయంత్రం ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతతో మరణించింది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు.. ఆమెకు మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉందంటూ అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు ఆమెకు వైద్యం అందుతోందని.. కోలుకుంటోందని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. అనుమానం వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి యాజమాన్యం దిగొచ్చింది. గొడవ మరింత పెద్దదై బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 8 లక్షలు ఇస్తామని ఒప్పందం పత్రం రాసి ఇచ్చినట్టు తెలుస్తోంది.