సనాతన ధర్మంపై వ్యాఖ్యలు..ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలిః సుబ్రహ్మణ్యస్వామి

ప్రాసిక్యూట్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ పంపించినట్లు వెల్లడి

swamy-writes-to-guv-seeking-action-against-udhayanidhi

చెన్నైః సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు గవర్నర్ ఆర్ ఆర్ రవికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. స్టాలిన్ కొడుకును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ తాను గవర్నర్‌కు లేఖ పంపించానన్నారు. ఉదయనిధి స్టాలిన్ మరోసారి కనుక సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడితే తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు కూడా వెనుకాడేది లేదని, అందుకోసమే పని చేస్తానన్నారు. భారత్ సమాఖ్య కాదని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తాను 1991లో నిరూపించినట్లు తెలిపారు.

సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడిన వ్యక్తి మంత్రి అని, ఓ పబ్లిక్ ఫిగర్ అని స్వామి పేర్కొన్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎక్కువమందికి చేరుకుంటాయని, ఆ వ్యాఖ్యలు సనాతన ధర్మ సమాజంలో ఆందోళనలు కలిగించాయన్నారు. ఉదయనిధి పార్టీ తమిళనాడులో అధికారంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అశాంతిని రేపేలా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని, ఆయనపై తక్షణమే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.