రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్న బ్రిటన్ ప్రధాని సునాక్ వ్యాఖ్యలు

లాక్‌డౌన్ విధించడం కంటే కొంతమందిని చనిపోనివ్వడమే మంచిదని వ్యాఖ్యానించారంటూ రిపోర్టులు

Sunak wanted to ‘let people die’ during pandemic, Vallance tells Covid inquiry

లండన్‌ః బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వివాదంలో చిక్కుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో రెండవసారి లాక్‌డౌన్ విధించడం కంటే కొంతమంది చనిపోవడానికి అనుమతించడమే మంచిదని సునాక్ వ్యాఖ్యానించారనే వార్తలు బ్రిటన్‌లో దుమారం రేపుతున్నాయి. నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉండగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అనే అంశంపై జరిగిన సమావేశంలో సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ మాజీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలెన్స్ పేర్కొన్నారు. ఈ మేరకు డైరీ ఎంట్రీని విచారణకు సమర్పించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ సీనియర్ సలహాదారు డొమినిక్ కమ్మిన్స్ ఈ విషయాన్ని తనకు చెప్పారని వాలెన్స్ పేర్కొన్నట్టు సమాచారం. కాగా తాజాగా బయటపడిన సునాక్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.

కాగా మే 4, 2020న సమావేశం జరిగిందని, ఇందుకు సంబంధించిన డైరీ ఎంట్రీని 25 అక్టోబర్ 2020న అందజేసినట్టు రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. కాగా ఈ వివాదంపై ప్రధాని రిషి సునాక్ ఇంతవరకు స్పందించలేదు. సాక్ష్యాధారాలను సమర్పించిన తర్వాతే దీనిపై సునాక్ ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్క బ్రిటన్‌లోనే ఏకంగా 2,20,000 మంది ప్రాణాలు కోల్పోయారు.