కాంగ్రెస్ పార్టీ లో విషాదం : కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ మృతి
కాంగ్రెస్ పార్టీ లో విషాదం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ (74) కన్నుమూశారు. ఈ నెల 4వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు. అయితే.. మే 7 వ తేదీన మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అయితే.. పండిట్ సుఖ్ రామ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఈ మేరకు పండిట్ సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ప్రకటించారు.
1993 నుంచి 1996 వరకు సమాచారశాఖ సహాయమంత్రిగా పనిచేసిన సుఖ్రామ్.. హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఐదుసార్లు విధాన సభకు, మూడుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జర్మనీ నుంచి గోవులను దిగుమతి చేసుకోవడం ద్వారా రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచడంలో సుఖ్ రామ్ కీలక పాత్ర పోషించారు. కాగా, సుఖ్రామ్ మరో మనవడైన ఆయుష్ శర్మ నటుడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆశ్రయ్ శర్మ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.