ఏపీకి ప్రత్యేక హోదా ఫై కేంద్రం ఫుల్ క్లారిటీ

ఏపీకి ప్రత్యేక హోదా ఫై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది. కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ దీనిపై రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ఒకరైన ప్రత్యేక హోదాను కేంద్రం గతంలోనే పక్కనపెట్టింది. ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు.

వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని వెల్లడించారు. 14వ ఆర్థికసంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. వైస్సార్సీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి స్పందించారు.

2015-2020 మధ్య పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని వివరించింది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశంపై ఏపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పోలవరం పూర్తి కావడం కష్టమే అని పేర్కొంది. వివిధ కారణాలతో గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదని తెలిపింది.