భారత్ పై దక్షిణాఫ్రికా విజయం
2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కైవసం
దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత్ పై విజయాన్ని సాధించింది. మూడు టెస్టుల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాస్సీ వాన్ డర్ డుస్సెన్ 41, టెంబా బవుమా 32 పరుగులతో తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అంతకుముందు, యువ ఆటగాడు కీగాన్ పీటర్సన్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడడం ఆటలో హైలైట్. పీటర్సన్ స్లిప్స్ లో ఇచ్చిన క్యాచ్ ను పుజారా జారవిడవడం ప్రతికూలంగా మారింది. ఈ సిరీస్ లో తొలి టెస్టును టీమిండియా నెగ్గిన తీరు చూస్తే, మిగతా టెస్టుల్లోనూ ఎదురుండదనిపించింది. అయితే, అనూహ్య రీతిలో దక్షిణాఫ్రికన్లు పుంజుకుని భారత్ పై ఎదురుదాడి చేశారు. వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గి సిరీస్ విజేతగా అవతరించారు. అటు, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు ఆశాభంగం తప్పలేదు.
జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/