పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే బిజెపి చూస్తూ ఊరుకోదు – సోము

పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తు అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదు లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మనోహర్ చెప్పిన దగ్గరి నుండి దీనిపైనే అంత మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే ..అభిమానుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూస్తారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో దీనిపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్బంగా వీర్రాజు ప్రస్తావించారు. పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.