మంచిర్యాలలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

మంచిర్యాలలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా..ఆరుగురి సజీవ దహనం అయ్యారు. మందమర్రి మండలంలో వెంకటాపూర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని మాసు శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇంటి మొత్తానికి వ్యాపించడంతో కుటుంబ సభ్యులతోపాటు మరో వ్యక్తి మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

ఈ ప్రమాదంలో ఇంటి యజమాని మాసు శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), ఆమె అక్క కుమార్తె మౌనిక(25), మరో ఇద్దరు చిన్నారులతోపాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య (50) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పద్మ అక్క కుమార్తె మౌనిక రెండు రోజుల క్రితమే కోటపల్లి మండలంలోని కొండంపేట నుంచి పద్మ ఇంటికి వచ్చారు. అగ్నిప్రమాదంలో ఆమె కూడా మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ అఖిల్‌ మహాజన్‌.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

అలాగే జగిత్యాల నగరంలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయిల్ మిల్లులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా మిల్లు మొత్తానికి మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. భారీగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.