రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంపై శశి థరూర్ స్పందన

నేను చిన్నప్పటి నుంచీ రాముడి భక్తుడిని…నా రాముడిని నేను బిజెపికి వదులుకోను

shashi-tharoor
shashi-tharoor

న్యూఢిల్లీః అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తాజాగా స్పందించారు. ప్రారంభోత్సవానికి గైర్హాజరైతే రాముడిని బిజెపికి వదులుకున్నట్టు కాదని వ్యాఖ్యానించారు. ‘‘నేను చిన్నప్పటి నుంచీ రాముడి భక్తుడిని, కాబట్టి నా రాముడిని నేను బిజెపికి వదులుకోను. రాముడిపై లేదా దైవ సంకల్పంపై బిజెపికి కాపీరైట్స్ ఏమీ లేవు’’ అని శశి థరూర్ వ్యాఖ్యానించారు. తనకు నచ్చిన టైంలోనే తాను రామమందిరానికి వెళతానన్నారు. తాను ప్రార్థించేందుకు దేవాలయాలకు వెళతానని, రాజకీయాలు చేసేందుకు కాదని స్పష్టం చేశారు.

రామమందిర ప్రారంభోత్సవాన్ని బిజెపి కార్యక్రమంగా ప్రకటించిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాని విషయం తెలిసిందే. హిందూమతం లేదా శ్రీరాముడి గురించి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని శశి థరూర్ స్పష్టం చేశారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయడంపైనే కాంగ్రెస్ అభ్యంతరమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి వెళ్లి ఉంటే అధికార పక్షం రాజకీయ కార్యక్రమంలో పాలుపంచుకున్నట్టై ఉండేదని వ్యాఖ్యానించారు.