సీఎం కేసీఆర్ ను తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ హీరో శర్వానంద్ ఆహ్వానం

గమ్యం ఫేమ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. జూన్‌ 3 (శనివారం)న శర్వానంద్‌-రక్షితారెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా శర్వానంద్‌ ఫ్యామిలీ జూన్‌ 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిశారు. తన పెళ్లి రిసెప్షన్‌కు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించారు. తన నివాసానికి వచ్చిన శర్వాను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్… రిసెప్షన్ కు తప్పకుండా వస్తానని తెలిపారు. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రెండు రోజులపాటు జరిగిన శర్వానంద్‌ పెళ్లి వేడుకకు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్‌, సిద్దార్థ్‌, అదితీరావు హైదరీతోపాటు ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. శర్వానంద్‌ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని. శర్వానంద్‌ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.