ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని గోరేగావ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోరేగావ్లోని ఓ ఏడంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నికీలల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడినవారిలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. కాగా, మంటల్లో పలు ద్విచక్రవాహనాలు, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.