శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు

ముంబై కోర్ట్ లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న ఎంపీ సంజయ్ రౌత్ కి బెయిల్ మంజూరు చేసింది ముంబై కోర్టు. అయితే ఈ కేసులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన సంజయ్ రౌత్ తనపై అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రతీకారానికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ ప్రభావవంతమైన వ్యక్తి అని ఆయన బయటకు రాగానే సాక్షులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఈడీ అధికారులు బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. ఇరువ్వురి వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి ఎంజి పాండే గత వారం న్యాయమూర్తి వాదనలను రిజర్వ్ చేశారు. తాజాగా సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

భూ కుంభకోణం కేసులో ఈడి సంజయ్ రౌత్ ని ఈ ఏడాది జూలై 31 అరెస్టు చేసింది. అప్పటినుండి ఆయన ముంబైలోని ఆర్థర్ జైల్లోనే ఉన్నారు. కాగా వంద రోజులు అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుకు ముందు సంజయ్ రౌత్ ఇంట్లో తొమ్మిది గంటలపాటు సోదాలు నిర్వహించిన ఈడి అధికారులు సుమారు 11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో పది లక్షల రూపాయలు ప్రత్యేక కవర్ లో ఉన్నట్లు సమాచారం. తనను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత వారం కోర్టులో విచారణ జరగగా భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉందని, ఆయనకి బెయిల్ ఇవ్వద్దని ఈడి కోరింది. అయితే నేడు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంజయ్ రౌత్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.