ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలాశయాలన్నీ ఉప్పొంగిప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. పక్క రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతుండడం తో గోదావరి ఉదృతగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు , నేతలు గోదావరి ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెపుతున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు.

రామన్న గూడెం, వాడ గూడెం కరకట్ట దగ్గర గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.. కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని వాగుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. మరోపక్క మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం భద్రాచలం లో పర్యటించారు. గోదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.. ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికి అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్య అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేనప్పటికీ అధికార యంత్రాంగం మరో 24గంటలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ.. బ్లీచింగ్ శానిటేషన్ చేయలని ఆదేశించారు.