వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఫై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్‌ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దళిత సంఘాలు మరియు టిఆర్ఎస్ నాయకులు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరు పెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్‌ షర్మిలపై SC, ST చట్టం కింద కేసు నమోదుచేయాలని దళిత నాయకులు పోలీసులను కోరారు. ఇక దీనిపై వైఎస్‌ షర్మిల ఎలా స్పందిస్తారో చూడాలి.

జోగిపేట బస్టాండ్ దగ్గర జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు..కంత్రి కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడ చూసినా కబ్జాలే..ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఒక దళితుడు అయి ఉండి చెరువులు,అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పండిత పుత్ర పరమ శుంఠ… నా కోడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్‌ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకండా దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు. నాడు షర్మిల చేసిన విమర్శలు, ఆరోపణలపైనే టీఆర్ఎస్‌ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఆమెపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.